Ind Vs Eng: ఐదో మ్యాచ్‌ రద్దు.. 2-1 ఆధిక్యంలో టీమిండియా.. ఇక..

10 Sep, 2021 15:13 IST|Sakshi

మాంచెస్టర్‌: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దైంది. ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. కాగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఓల్డ్‌ ట్రఫోర్ట్‌ మైదానంలో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌ రద్దు కావడంతో సిరీస్‌ కోహ్లి సేన సొంతం కావడం ఇక లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరోవైపు... అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన ఐదో టెస్టు కోవిడ్‌ కారణంగా రద్దు కావడంతో..  జూలైలో టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన(పరిమిత ఓవర్ల క్రికెట్‌) నేపథ్యంలో అప్పుడు ఈ టెస్టు మ్యాచ్‌ నిర్వహించేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ఫలితం ఆధారంగానే సిరీస్‌ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక మ్యాచ్‌కు ముందు గురువారం టీమిండియా పిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో పాటు శిక్షణ సిబ్బందిలో మరికొందరు మహమ్మారి బారిన పడడంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఈసీబీ తొలుత ప్రకటించింది. ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బంది అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది.

ఈ క్రమంలో బీసీసీఐతో చర్చించిన అనంతరం మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఆటగాళ్లందరికీ నెగిటివ్‌ వచ్చినప్పటికీ ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్‌, మూడో టెస్టులో ఇంగ్లండ్‌ గెలుపొందాయి. ఇక నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నిర్ణయాత్మక ఐదో టెస్టు రద్దైంది.

చదవండి: T20 World Cup 2021: విండీస్‌ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు
Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు