Sunil Gavaskar: నాడు ఇంగ్లండ్‌ చేసిన పనిని మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..!

10 Sep, 2021 20:59 IST|Sakshi

IND VS ENG 5th Test Reschedule: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య షెడ్యూల్‌ సమయానికి మూడు గంటల ముందు ర‌ద్దైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీసీసీఐ, ఈసీబీల మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం​. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహణపై బీసీసీఐ ప్రతిపాదనను భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ స్వాగతించాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు.

2008లో ముంబై దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్​ 26) కటక్​లో భారత్​, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండింది. దాడుల కారణంగా 7మ్యాచ్​ల సిరీస్​లోని చివరి రెండు వన్డేలను రద్దయ్యాయి. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు​ స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్​ల టెస్టు సిరీస్​పై సందిగ్ధత నెలకొంది. అయితే టెస్టు సిరీస్​ ఆడటానికి ఇంగ్లండ్‌ జట్టు భారత్​కు తిరిగి రావడంతో అప్పట్లో ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. 

షెడ్యూల్​లో ఉన్న ప్రకారం అహ్మదాబాద్​, ముంబైలో కాకుండా అహ్మదాబాద్​, చెన్నైలలో ఆ రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈ సిరీస్​లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 0-1తో ఓడింది. కాగా, సునీల్ గవాస్కర్ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ ​చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని, ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్​ కోసం ఇంగ్లీష్ జట్టు​ మళ్లీ భారత్​కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపాలని కోరాడు. నాడు ఇంగ్లండ్‌ జట్టు ఉగ్రదాడి తర్వాత కూడా భారత్‌లో పర్యటించిందంటే.. అది కేవలం నాటి కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ చొరవ వల్లేనన్నాడు.
చదవండి: ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?

>
మరిన్ని వార్తలు