Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్‌ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? వ్యూహాలు రచించలేరా?

30 Jun, 2022 13:28 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలు

Ind Vs Eng Test- Aakash Chopra Comments on Jasprit Bumrah Likely To Lead Team India: టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టుకు సారథిగా జస్‌ప్రీత్‌ బుమ్రా పేరు దాదాపుగా ఖరారైనట్లే! ఒకవేళ అదే జరిగితే భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ తర్వాత కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్న మొదటి పేసర్‌గా బుమ్రా నిలవనున్నాడు. 

అయితే, కొంతమంది మాత్రం బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ఏ స్థాయిలోనూ.. ఏ ఫార్మాట్‌లోనూ ఇంత వరకు కెప్టెన్‌గా పనిచేయని కారణంగా అతడు ఏ మేరకు రాణిస్తాడో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

బౌలర్లకు మెదడు తక్కువా? కానేకాదు!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టుకు జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్‌ అయితే.. నిజంగా అది పెద్ద విషయమే. అంతేకాదు అతడికి దక్కే గొప్ప గౌరవం కూడా! ఒక బౌలర్‌ కెప్టెన్‌ ఎందుకు కాకూడదని చాలా మంది అడుగుతూ ఉంటారు?

అంతేకాదు బౌలర్లకు ఏమైనా బ్రెయిన్‌ తక్కువగా ఉంటుందా? వారు జట్టును ముందుకు నడిపించే వ్యూహాలు రచించలేరా? అంటే కాదనే చెప్తాను. నిజానికి బ్యాటర్ల కంటే బౌలర్ల మెదళ్లు మరింత చురుగ్గా పని చేస్తాయి. ఎందుకంటే.. వాళ్లు తమ కెరీర్‌లో ఎంతో మంది బ్యాటర్ల ఆట తీరును గమనిస్తూ ఉంటారు. పని భారాన్ని చక్కగా మేనేజ్‌ చేసుకుంటారు. 

ఎవరికి ఎలా బౌలింగ్‌ చేయాలో ప్రణాళికలు రచించుకుంటారు. ఇది ఎంతో అత్యుత్తమైన జాబ్‌! కాబట్టి బౌలర్లు మంచి కెప్టెన్లు కారన్న అపోహ నుంచి బయటపడాలి’’ అని పేర్కొన్నాడు. కాగా గతంలో బౌలర్‌ అనిల్‌ కుంబ్లే తదితరులు టీమిండియాకు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సమకాలీన క్రికెట్‌లో మేటి జట్టు అయిన ఆస్ట్రేలియాకు పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ సారథిగా ఉన్నాడు.

చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"

మరిన్ని వార్తలు