Rishab Pant: సిక్స్‌ కొట్టిన వెంటనే ఔటయ్యాడు; అభిమానుల ట్రోల్‌

6 Aug, 2021 19:21 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్‌ పంత్‌ ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో కుదురుకుంటున్న సమయంలో వికెట్‌ ఇచ్చుకోవడం పంత్‌కు అలవాటుగా మారిపోయింది. తాజాగా పంత్‌ షాట్‌ ఎంపికలో నిర్లక్ష్యం మరోసారి కనిపించింది. మ్యాచ్‌లో 25 పరుగులతో మంచి టచ్‌లో కనిపించాడు. పంత్‌ ఔటయ్యే ముందు ఓలి రాబిన్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 50వ ఓవర్లో సిక్స్‌, ఫోర్‌తో దూకుడు మీద కనిపించాడు. అయితే సిక్స్ కొట్టిన మరుసటి బంతికే పంత్‌ ఔటయ్యాడు.

ఓలి రాబిన్‌సన్‌ వేసిన గుడ్‌లెంగ్త్‌ బంతి పంత్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ నేరుగా బెయిర్‌ స్టో చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో పంత్‌ నిరాశగా క్రీజు నుంచి వెనుదిరిగాడు. అయితే పంత్‌ ఔటైన తీరుపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. పంత్‌ నువ్వు మారవా.. సిక్స్‌ కొట్టిన వెంటనే అవుట్‌ కావడం అలవాటుగా చేసుకున్నావా.. దినేష్‌ కార్తిక్‌ లండన్‌లోనే ఉన్నాడు.. పంత్‌ను తీసేసీ అతనికి చాన్స్‌ ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కాగా టీమిండియా తొలి టెస్టులో స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కేఎల్‌ రాహుల్‌ 84 పరుగులతో నిలకడైన ఆటతీరు ప్రదర్శించడం.. జడేజా అతనికి సహకరించడంతో భారత్‌ 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం భారత్‌ 73 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. జడేజా 39, మహ్మద్‌ షమీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు