James Anderson: 70 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

14 Aug, 2021 12:23 IST|Sakshi

లండన్: స్వింగ్ కింగ్,  ఇంగ్లండ్ వెటరన్‌ పేసర్‌ జిమ్మీ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆండర్సన్‌.. గడిచిన 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన(39 ఏళ్ల 14 రోజులు) పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్‌ శర్మ, పుజారాలను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు రహానే, ఇషాంత్ శర్మ, బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

టెస్టు క్రికెట్‌లో అత్యంత పెద్ద వయసులో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్‌కు ఇది 31వ సారి. ప్రస్తుత ఆటగాళ్లలో అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కాగా, అండర్సన్‌కు లార్డ్స్‌ మైదానంలో భారత్‌పై మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనతో మొత్తంగా 33 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా అండర్సన్‌ 164 టెస్టుల్లో 626 వికెట్లుతో మూడో అత్యధిక టెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. ఆండర్సన్‌(5/62) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్‌(2/34) దెబ్బతీయగా, బర్న్స్‌(49), రూట్‌(48 బ్యాటింగ్‌) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు