వైరల్‌: సహనం కోల్పోయిన కృనాల్‌.. అంపైర్‌ జోక్యంతో!

23 Mar, 2021 20:39 IST|Sakshi
కృనాల్‌ పాండ్యా- టామ్‌ కరన్‌(ఫొటో: డిస్నీ+ హాట్‌స్టార్‌)

పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా, మొదటి మ్యాచ్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకుని సత్తాచాటాడు. 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న కృనాల్‌, అరంగేట్రంలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేగాక, తొలి వన్డేలోనే అర్ధ శతకం సాధించిన 15వ టీమిండియా ఆటగాడిగా, అదే విధంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఫిఫ్టీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

మరోవైపు, సోదరుడు హార్దిక్‌ పాండ్యా చేతుల మీదుగా వన్డే క్యాప్‌ అందుకున్న కృనాల్‌ తండ్రిని తలచుకుని భావోద్వేగానికి లోనైన క్షణాలు అతడి అభిమానుల మనసును మెలిపెడుతున్నాయి. ఇలా మంగళవారం మ్యాచ్‌ ఆరంభమైన సమయం నుంచి అతడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే, అంతా బాగానే ఉన్నా, 49వ ఓవర్‌లో కృనాల్‌ చేసిన ఓ పని సోషల్‌ మీడియాలో దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌ బౌలింగ్‌ల్‌ సింగిల్‌ తీసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

వీరి మాటల యుద్ధం శ్రుతిమించడంతో అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, కృనాల్‌ వెనక్కి తగ్గలేదు. ‘అసలేంటి నీ సమస్య’ అన్నట్లుగా టామ్‌ కరన్‌ వైపు దూసుకురాబోయాడు. ఇంతలో జోస్‌ బట్లర్‌ సైతం టామ్‌కు జతకలిశాడు. అయితే, వెంటనే టామ్‌ తన స్థానంలోకి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాగా కృనాల్‌- టామ్‌ కరన్‌ గొడవకు గల స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. 

చదవండి: కృనాల్‌ ఖాతాలో పలు రికార్డులు

మరిన్ని వార్తలు