టీ20 వరల్డ్ కప్‌ విజేత ఆ జట్టే: మైకేల్‌ వాన్

20 Mar, 2021 21:17 IST|Sakshi

అహ్మదాబాద్: టీమిండియా- ఇంగ్లండ్‌ సిరీస్‌ మొదలైన నాటి నుంచి ఇంగ్లిష్‌ జట్టు మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అహ్మదాబాద్‌ పిచ్‌పై విపరీతంగా ట్రోల్‌ చేసిన వాన్..‌ టీ20 సిరీస్‌ గురించి తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న తొలి టీ20లో తమ జట్టు గెలవగానే..  ‘‘భారత జాతీయ టీ20 జట్టు కంటే, ఐపీఎల్‌ టీం ముంబై ఇండియన్స్‌ జట్టు నయం అనిపిస్తోంది’’ అంటూ వ్యంగ్య బాణాలు విసిరాడు. అయితే రెండో మ్యాచ్‌లో టీమిండియా అంతకు అంతా బదులు తీర్చుకున్నప్పటికీ... ‘‘నేను ముందే చెప్పాను కదా.. టీమిండియా టీ20 జట్టు కంటే ముంబై ఇండియన్స్‌ బెటర్‌ అని. ఇషాన్‌ కిషన్‌(ముంబై ఇండియన్స్‌కు ఆడటాన్ని ఉద్దేశించి) అరంగేట్రంలోనే అదరగొట్టాడు’’ అని అక్కసు వెళ్లగక్కాడు.  

ఇక తాజాగా సిరీస్‌లో నిర్ణయాత్మ‍క ఐదో టీ20 జరుగుతున్న వేళ మరోసారి తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు మైకేల్‌ వాన్‌. ఈ ఏడాది ద్వితీయార్థంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడే జట్లు ఇవేనంటూ జోతిష్యం చెప్పాడు. ‘‘నేటి టీ20 ఫైనల్‌ మ్యాచే.. రానున్న 8 నెలల్లో ఇదే వేదికపై జరుగనున్న.. టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ వంటిది. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుస్తుంది’’ అని ఈ‌ మాజీ కెప్టెన్‌ వాన్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు. కాగా టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఇక ఐదో మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆదిలోనే జేసన్‌ రాయ్‌ వికెట్‌ కోల్పోయింది.


చదవండి: సూర్యకుమార్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా వదినమ్మా?!
'వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు భయపడాల్సిందే'

మరిన్ని వార్తలు