Rohit Sharma Daughter: నాన్న రూమ్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు

28 Jun, 2022 10:48 IST|Sakshi
తల్లి రితికాతో సమైరా శర్మ(PC: Twitter)

India Vs England: టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా జూలై 1 నుంచి రీషెడ్యూల్డ్‌ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడటంతో మ్యాచ్‌ ఆరంభం నాటికి అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ ఆరోగ్యం గురించి అతడి చిన్నారి కుమార్తె సమైరా శర్మ ‘తనకు తెలిసిన అప్‌డేట్‌’ ఇచ్చింది.

తల్లి రితికాతో కలిసి సమైరా బయటకు వచ్చింది. ఆమెను చూసిన ఓ వ్యక్తి నాన్న ఎలా ఉన్నాడు అని అడుగగా... ‘‘డాడీ తన రూమ్‌లోనే ఉన్నాడు. పాజిటివ్. ఇంకా నెల రోజులు’’ అంటూ తన ముద్దు ముద్దు మాటలతో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా రోహిత్‌ శర్మకు కరోనా సోకడంతో అతడి స్థానంలో ఓపెనింగ్‌ చేసేందుకు స్టాండ్‌ బైగా మయాంక్‌ అగర్వాల్‌ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపింది.

మరోవైపు..కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా ఈ టెస్టుకు దూరం కావడంతో యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇక గతేడాది ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కలకలం కారణంగా వాయిదా పడ్డ ఈ టెస్టును జూలైలో నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరుకున్న భారత జట్టు రీషెడ్యూల్డ్‌ టెస్టుతో పాటు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్‌ ఎవరు?

మరిన్ని వార్తలు