IND VS NED: ఎవ్వరికీ రెస్ట్‌ ఇచ్చేది లేదు.. హార్ధిక్‌ సహా అందరూ ఆడతారు..!

26 Oct, 2022 15:37 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో తుది జట్టు కూర్పుపై భారత బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. రేపు (అక్టోబర్‌ 27) నెదర్లాండ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో హార్ధిక్‌ సహా ఎవ్వరికీ రెస్ట్‌ ఇచ్చేది లేదని స్పష్టం చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్‌ కనీసం రెండు, మూడు మార్పులతో బరిలోకి దిగుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో మాంబ్రే ఈ మేరకు క్లారిటీ ఇచ్చాడు.

హార్ధిక్‌ ఫిట్‌గా లేడని వస్తున్న ఊహాగానాలకు మాంబ్రే చెక్‌ పెట్టాడు. హార్ధిక్‌ వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని, టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు. పాక్‌తో మ్యాచ్‌లో హార్ధిక్‌ అలసిపోయిన మాట వాస్తవమేనని, ఈ మధ్య విరామంలో అన్ని సర్దుకున్నాయని వివరించాడు. హార్దిక్ జట్టులో కీలక ఆటగాడని, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని, ఇలాంటి సమయంలో అతనికి రెస్ట్‌ ఇచ్చి లయ తప్పేలా చేయలేమని తెలిపాడు.

మరోవైపు పాక్‌తో మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌ల వైఫల్యంపై కూడా మాంబ్రే స్పందించాడు. ఒక్క మ్యాచ్‌ వైఫల్యంతో ఆటగాడి పక్కకు పెట్టే ఆలోచన చేయలేమని వివరణ ఇచ్చాడు. ఆటగాళ్ల రొటేషన్‌కు ఇది సమయం కాదని అంతిమంగా క్లారిటీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి మ్యాచ్‌ కీలకమేనని, చిన్న జట్లు కదా అని ఏమరపాటుగా ఉండే ఛాన్సే లేదని పేర్కొన్నాడు.

పాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ తిరిగి ఫామ్‌లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్‌.. చిరకాల ప్రత్యర్ధి పాక్‌పై 4 వికెట్ల తేడాతో విజయం​ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు పోరాడి చారిత్రక విజయాన్ని సాధించింది.
చదవండి: IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’

>
Poll
Loading...
మరిన్ని వార్తలు