Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం..

28 Jan, 2023 11:01 IST|Sakshi
భారత జట్టు (PC: BCCI)

India vs New Zealand, 1st T20I: టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా మిచెల్‌ సాంట్నర్‌ బృందం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

మా ఓటమికి కారణం అదే
కివీస్‌ ఆలౌరౌండ్‌ ప్రతిభతో విజయం సాధించగా.. టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు.  ‘‘రాంచి వికెట్‌ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇరు జట్లకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. 

అయితే, న్యూజిలాండ్‌ మాకంటే మెరుగ్గా ఆడింది. అందుకే అనుకున్న ఫలితం రాబట్టగలిగింది. నిజానికి కొత్త బంతి అనుకోని రీతిలో టర్న్‌ అవడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నేను, సూర్య బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వికెట్‌ కాస్త మెరుగైంది. ఏదేమైనా ఈ వికెట్‌పై ప్రత్యర్థిని 176- 177 వరకు పరుగులు చేయనివ్వడం సరికాదు. 

మా బౌలింగ్‌ వైఫల్యం కారణంగానే ఇలా జరిగింది. 20-25 పరుగులు ఎక్కువగానే ఇచ్చుకున్నాం. మా జట్టులో యువకులే ఎక్కువ. ఈ ఓటమి నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటాం’’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

సుందర్‌ సూపర్‌
ఇక వాషింగ్టన్‌ సుందర్‌ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు న్యూజిలాండ్‌పై తను బౌలింగ్, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ చేసిన విధానం అమోఘం. మాకు ఇలాంటి వాళ్లే కావాలి. వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది’’ అంటూ హార్దిక్‌ ప్రశంసలు కురిపించాడు. 

అదరగొట్టిన సుందర్‌
కాగా కివీస్‌తో తొలి టీ20లో 4 ఓవర్ల బౌలింగ్‌లో 22 పరుగులు మాత్రమే ఇచ్చిన వాషీ 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సూర్య(47), పాండ్యా(21) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేసిన వేళ అర్ధ శతకంతో రాణించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో వాషింగ్టన్‌ సుందర్‌ 50 పరుగులు సాధించాడు. 

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ స్కోర్లు
►న్యూజిలాండ్‌- 176/6 (20)
►ఇండియా- 155/9 (20)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: డారిల్‌ మిచెల్‌30 బంతుల్లో 59 పరుగులు- నాటౌట్‌
చదవండి: T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్‌ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్‌..
Ranji Trophy: ముంబై- మహారాష్ట్ర మ్యాచ్‌ డ్రా.. క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్ర

మరిన్ని వార్తలు