Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్‌.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్‌ ఆడించలేదు!

5 Dec, 2021 12:05 IST|Sakshi

Ind vs NZ, 2nd Test: Dinesh Karthik Explains Reson Behind Virat Kohli Not Enforcing the Follow-on in the Mumbai Test: ముంబై టెస్టులో టీమిండియా బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్‌ 62 పరుగులకే ఆలౌట్‌ అయి తొలి ఇన్నింగ్స్‌ ముగించిన విషయం విదితమే. మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌ కివీస్‌ను దెబ్బకొట్టి భారత్‌కు భారీ స్థాయి ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే,రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా విలియమ్సన్‌ బృందం ఆలౌట్‌ కావడం.. టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో ఫాలో ఆన్‌ ఆడిస్తారని అంతా భావించారు. 

కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తమ జట్టును బ్యాటింగ్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘అందరిలాగే నాకూ కాస్త ఆశ్చర్యం కలిగినా.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. ఈ టెస్టు(రెండో టెస్టు) మూడు లేదంటే నాలుగు రోజుల్లో ముగించినా అదనపు పాయింట్లు రావు కదా! 

నిజానికి ఈ వికెట్‌ రోజురోజుకీ మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. కాబట్టి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టడం వాళ్లకు(టీమిండియా) మరింత సులువుగా మారుతుంది’’ అని కోహ్లి నిర్ణయం వెనుక కారణాలను విశ్లేషించాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఛతేశ్వర్‌ పుజారా, కోహ్లికి బ్యాటింగ్‌ ప్రాక్టీసు అయినట్లు ఉంటుందని ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కోహ్లి, నయా వాల్‌ పుజారా డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: IND Vs NZ: అది నా డ్రీమ్‌ బాల్‌.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్
Sourav Ganguly: నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు