IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌..!

29 Nov, 2022 17:16 IST|Sakshi

న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ తెలిసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్‌ వేదికగా రేపు (నవంబర్‌ 30) జరుగబోయే మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. క్రైస్ట్‌చర్చ్‌లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్‌ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్‌ ప్రెడిక్షన్‌లో వెల్లడించింది.

ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్‌ సాధ్యపడకపోతే సిరీస్‌ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్‌ జరిగితే, సిరీస్‌ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్‌ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. 

ఇదిలా ఉంటే, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిం‍దే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన హార్ధిక్‌ సేన.. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 

మరిన్ని వార్తలు