IND VS NZ 3rd ODI: 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సెంచరీ బాదిన హిట్‌మ్యాన్‌

24 Jan, 2023 15:21 IST|Sakshi

దాదాపు 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది.  టీమిండియా సారధి రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ఓ సెంచరీ సాధించాడు. 2021 సెప్టెంబర్‌ 2న (ఇంగ్లండ్‌పై ఓవల్‌ టెస్ట్‌లో) చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో శతక్కొట్టిన హిట్‌మ్యాన్‌.. ప్రస్తుతం ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో మెరుపు శతకం బాదాడు. హిట్‌మ్యాన్‌కు వన్డేల్లో ఇది 30వ సెంచరీ కాగా, అన్ని ఫార్మట్లలో కలిపితే 42వది. టీమిండియా కెప్టెన్‌ ఖాతాలో 8 టెస్ట్‌ సెంచరీలు, 4 టీ20 శతకాలు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో 83 బంతులను ఎదుర్కొన్న రోహిత్‌.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సైతం సెంచరీకి 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఫలితంగా టీమిండియా 25.3 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టపోకుండా 206 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. కాగా, 3 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే..  ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. 

మరిన్ని వార్తలు