ఓటమితో మైండ్‌ బ్లాంక్‌.. టీవీ పగలగొట్టిన అభిమాని..అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు! ట్విస్ట్‌ ఏమిటంటే

24 Oct, 2022 12:05 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అధ్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్‌ యావత్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్‌ విజయంతో భారత అభిమానులు ఒకరోజు ముందే దీపావళి చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ చేతిలో తమ జట్టు ఓటమికి జీర్ణుంచుకోలేక ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. మ్యాచ్ అయిపోగానే కొందరు టీవీలు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఆ వీడియో ఇప్పటిది కాదు
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అయిపోగానే ఓ పాక్ అభిమాని తన టీవీని పగలగొట్టినట్లుగా ఇందులో కనిపించిది. దానిపైకి వస్తువును విసరడమే గాక.. కాలుతో తన్ని దాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు ఆ దృశ్యాల్లో ఉంది.

అతడి ఆగ్రహాన్ని చూసి సెహ్వాగ్ సైటెర్లు వేశాడు. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. రిలాక్స్ అవ్వండి. మేము ఇక్కడి దీపావళి టపాసులు పేల్చుతుంటే.. మీరేమో టీవీలు పగలగొడుతున్నారు. పాపం టీవీలు ఏం చేశాయి? అని రాసుకొచ్చాడు. నవ్వే ఓ ఎమోజీ కూడా పెట్టాడు. దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అయితే, నిజానికి ఇది టీ20 వరల్డ్‌కప్‌-2022లో భారత్‌- పాక్‌ నాటి మ్యాచ్‌కు సంబంధించింది కాదు. 2016లో ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడగా.. దీనిని భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు లింక్‌ చేసి వైరల్‌ చేయడం గమనార్హం.

చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్‌'పై తీవ్ర దుమారం

మరిన్ని వార్తలు