ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్‌! ముందు అరంగేట్రం చేయనివ్వు!

26 Aug, 2022 12:43 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(PC: BCCI/PCB)

Asia Cup 2022 India Vs Pakistan: టీమిండియాతో మెగా పోరుకు ముందు కీలక బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది గాయపడటంతో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఈ స్టార్‌ పేసర్‌ లేకుండానే ఆసియాకప్‌-2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పాక్‌ బరిలోకి దిగనుంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా భారత టాపార్డర్‌ను కుప్పకూల్చి పాక్‌కు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆఫ్రిది.

ఆరంభంలోనే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(3), రోహిత్‌ శర్మ(0)లను అవుట్‌ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అర్ధ శతకంతో రాణించిన నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(57) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భారత జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించాడు.

జట్టు గెలుపునకు బాటలు పరిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఆసియా కప్‌-2022 టోర్నీలో రెండో మ్యాచ్‌లో భారత్‌- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. గాయపడిన ఆఫ్రిది జట్టుతో దుబాయ్‌ వరకు వచ్చాడు గానీ ఆడే అవకాశం మాత్రం లేదు. ఆఫ్రిది గైర్హాజరీతో పాక్‌ జట్టులో కలవరం మొదలైంది.


పాకిస్తాన్‌ కోచ్‌ సక్లైన్‌ ముస్తాక్‌(PC: PCB)

ఆ ముగ్గురు చాలు!
ఈ నేపథ్యంలో ఆ జట్టు హెడ్‌కోచ్‌ సక్లైన్‌​ ముస్తాక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్రిది లేకపోయినప్పటికీ నసీం షా, మహ్మద్‌ హస్నైన్‌, హారిస్‌ రవూఫ్‌ రూపంలో పేస్‌ త్రయం తమకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతున్న వేళ ముస్తాక్‌ పత్రికా సమావేశంలో పాల్గొన్నాడు. 

‘‘గత కొన్నేళ్లుగా ఈ ముగ్గురు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. హెడ్‌కోచ్‌గా నేను.. మా కెప్టెన్‌, సహాయక​ సిబ్బంది... ఇలా అందరికీ వారి ప్రతిభాపాటవాలపై నమ్మకం ఉంది. 

నిజానికి పేస్‌ దళానికి షాహీన్‌ నాయకత్వం వహించేవాడు. అయితే, ఈ ముగ్గురు తమదైన రోజున చెలరేగుతారు. భారత జట్టుకు గట్టి సవాల్‌ విసురుతారు’’ అని సక్లైన్‌ ముస్తాక్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా హారిస్‌ సీనియర్‌ పేసర్‌ అన్న విషయం తెలిసిందే.

ఇంకా అరంగేట్రం చేయలేదు!
ఇక షాహిన్‌ ఆఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల హస్నైన్‌ ఇప్పటి వరకు ఆడిన 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. 19 ఏళ్ల నసీం ఇంకా ఇంటర్నేషనల్‌ టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం కూడా చేయలేదు. అయితే, టెస్టుల్లో ఇప్పటి వరకు 33, వన్డేల్లో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

మరోవైపు.. దూకుడైన ఆటకు మారుపేరుగా మారిన టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ వంటి బ్యాటర్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సక్లైన్‌ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

‘‘కాన్ఫిడెన్స్‌ ఉంటే మంచిదే.. కానీ అతి ఎప్పుడూ పనికిరాదు. ఇంకా బచ్చా గాళ్లే కదా! చూద్దాం ఎవరు ఎవరికి గట్టి సవాల్‌ విసురుతారో! సీనియర్ల సంగతి పక్కనపెడితే.. మా అర్ష్‌దీప్‌ సింగ్‌ను మీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో ముందు చూసుకోండి’’ అని కామెంట్లు చేస్తున్నారు.   

చదవండి: Shaheen Afridi: నేనూ నీలాగే ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టాలనుకుంటున్నా పంత్‌: పాక్‌ బౌలర్‌
Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్‌ ఆందోళన!

>
Poll
Loading...
మరిన్ని వార్తలు