T20 WC 2022: ఐపీఎల్‌లో మాత్రం ఆడతాడు.. ఇప్పుడేమో ఇలా! అతడికి ఒకవేళ రెస్ట్‌ అవసరమైతే!

29 Sep, 2022 15:01 IST|Sakshi
అక్షర్‌ పటేల్‌తో బుమ్రా

Ind Vs SA T20 Series- T20 World Cup 2022- Jasprit Bumrah: గాయం కారణంగా ఆసియాకప్‌- 2022 టీ20 టోర్నీకి దూరమైన టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. రెండో టీ20తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ రెండు ఓవర్లు బౌల్‌ చేశాడు. మొత్తంగా 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

అయితే, ఆఖరిదైన మూడో టీ20లో మాత్రం ఈ పేసు గుర్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆరంభమైన నేపథ్యంలో బుమ్రా తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే భావిస్తే.. మరోసారి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

వెన్నునొప్పి కారణంగా
ప్రాక్టీసు సెషన్‌లో భాగంగా వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా సఫారీలతో గురువారం నాటి తొలి టీ20 సందర్భంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2022 ఆరంభానికి ముందు ప్రధాన పేసర్‌ ఇలా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. 

ఐపీఎల్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడు!
ఈ నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై క్రీడా, అభిమాన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంతమంది నెటిజన్లు బుమ్రా తీరుపై విరుచుకుపడుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే ఈ ఆటగాడు.. దేశం తరఫున ఆడాల్సివచ్చినపుడు ఇదిగో ఇలా గాయాల పేరు చెబుతాడు అంటూ తీవ్రస్థాయిలో ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, బుమ్రా అభిమానులు మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఇలా!
ఉద్దేశపూర్వకంగా ఎవరూ జట్టుకు దూరం కారని.. దేశం తరఫున ఆడే అవకాశాన్ని వదులుకోరని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా సైతం బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఐసీసీ మెగా టోర్నీకి సమయం ఆసన్నమవుతోందని.. గాయంతో బాధపడుతున్న బుమ్రాకు తగినంత విశ్రాంతినివ్వాలని సూచించాడు.

రెస్ట్‌ ఇవ్వండి
ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘భారత జట్టులో అతడు కీలక సభ్యుడు. అతడిని ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు ఆడించకపోయినా సరే.. గాయపడకుండా చూసుకోవడం ముఖ్యం. ఒకవేళ తను విశ్రాంతి కోరుకుంటే మరికొన్నాళ్లు పాటు రెస్ట్‌ ఇవ్వండి’’ అని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.

ప్రొటిస్‌తో రెండో టీ20(అక్టోబరు 2)లో బుమ్రాను ఆడించకపోవడమే మంచిదని అజయ్‌ జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా తిరువనంతపురంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs SA ODI: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ
IND vs SA: సూర్యకుమార్‌ సరికొత్త చరిత్ర.. ప్రపంచం‍లోనే తొలి ఆటగాడిగా


 

మరిన్ని వార్తలు