Ind Vs Sa 3rd Test- Virat Kohli: వాళ్లిద్దరు బాగా ఆడారు.. అందుకే కోహ్లి అలా చేశాడు: దక్షిణాఫ్రికా బౌలర్‌

14 Jan, 2022 08:57 IST|Sakshi
PC: Disney+ Hotstar(Twitter)

Ind Vs Sa 3rd Test-  Elgar DRS Call- Kohli Reaction Viral: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా విరాట్‌ కోహ్లి బృందం వ్యవహరించిన తీరుపై ప్రొటిస్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి స్పందించాడు. ఒత్తిడిని తట్టుకోలేకే అసహనం ప్రదర్శించారని వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే...  దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో బంతి కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్‌ దిశగా కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అశ్విన్‌ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు.

కానీ.. ఎల్గర్‌ మాత్రం రివ్యూకు వెళ్లాడు. ‘బాల్‌ ట్రాకింగ్‌’ను ప్రసారకర్తలు తప్పుగా చూపించడంతో.. ఫీల్డ్‌ ఎంపైర్‌ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించడం జరిగాయి. దీంతో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి సహా అశ్విన్‌, కేఎల్‌​ రాహుల్‌ ప్రసారకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కోహ్లి అయితే.. స్టంప్స్‌ వద్ద నిలబడి ‘ఎప్పుడూ మా మీదే దృష్టి పెడితే ఎలా. మీ జట్టును కూడా కాస్త చూసుకోండి’ అంటూ సెటైర్లు వేశాడు. ఇక ఆ తర్వాత రివ్యూ ద్వారానే భారత్‌కు బుమ్రా బౌలింగ్‌లో ఎల్గర్‌ వికెట్‌ దక్కడం విశేషం.

ఈ విషయంపై స్పందించిన ఎంగిడి.. ‘‘ఎల్గర్‌, పీటర్సన్‌ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ద్వయాన్ని విడదీయాలని వాళ్లు(టీమిండియా) ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. అది కష్టతరంగా మారింది. దాంతో వాళ్లు అసహనానికి గురయ్యారు. అయినా ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కోలా ఉంటాయి. అసహనం, విసుగు వంటి ఉద్వేగాలను ప్రదర్శించడం సహజమే. అంతేగానీ, ఎవరు కూడా ఉద్దేశపూర్వంగా అలా చేయరు. నిజానికి టీమిండియా ఒత్తిడిలో ఉంది. మైదానంలో వారు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని వ్యాఖ్యానించాడు.

కాగా ఆఖరిదైన మూడో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరుతుంది. కానీ.. ప్రొటిస్‌ జట్టు బలంగా నిలబడి.. మన ఆశలపై నీళ్లు చల్లేలా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగో రోజు ఆటలో మన బౌలర్లు ఎంత త్వరగా ఎనిమిది వికెట్లు పడగొడుతారన్న అంశంపైనే మన విజయం ఆధారపడి ఉంది. లేదంటే మరోసారి రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిందే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన కాస్త ఒత్తిడికి గురవడం సహజమే!

చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు

మరిన్ని వార్తలు