Ind vs Sa ODI Series: టీమిండియాకు ఎదురుదెబ్బ... వాళ్లిద్దరూ డౌటే.. రుతు, అయ్యర్‌, షారుఖ్‌కు బంపరాఫర్‌!

28 Dec, 2021 12:51 IST|Sakshi

Ind vs Sa ODI Series Squad: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. వాస్తవానికి దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ ముగిసిన తర్వాత సెలక్టర్లు సమావేశం కావాల్సి ఉంది. కానీ ఈ మీటింగ్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  ఫిట్‌నెస్‌పై స్పష్టత రాకపోవడంతోనే జట్టు ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. 

ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ కమిటీ సమావేశం ఆలస్యమైంది. మొదటి టెస్టు(టీమిండియా- సౌతాఫ్రికా) ముగిసిన తర్వాత మీటింగ్‌ జరపాలనే యోచనలో ఉన్నాం. డిసెంబరు 30 లేదంటే 31న సమావేశం ఉంటుంది. అయితే, బోర్డు నుంచి ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడాల్సి ఉంది. రోహిత్‌ శర్మ గాయం కారణంగానే ఆలస్యం అవుతోంది. అతడు కోలుకుంటే ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.

అదే విధంగా టెస్టు సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సదరు అధికారి తెలిపారు. ‘‘జడేజా, అక్షర్‌ వన్డే సెలక్షన్‌కు అందుబాటులో ఉండరని తెలిసింది. రోహిత్‌ మాత్రం చివరి నిమిషంలోనైనా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’’అని ఫస్ట్‌పోస్ట్‌తో చెప్పుకొచ్చారు. ఇక విజయ్‌ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, షారుఖ్‌ ఖాన్‌లను జట్టు ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌ నిమిత్తం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26న తొలి టెస్టు ఆరంభం కాగా.. జనవరి 19 నుంచి వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఇక టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జడేజా, అక్షర్‌ పటేల్‌ గాయాల కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్‌ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. 

చదవండి: KL Rahul: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!
Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్‌ బౌలర్‌!

మరిన్ని వార్తలు