Ind Vs Sa ODI Series: వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియా... ధావన్‌ ఫొటో వైరల్‌

15 Jan, 2022 13:06 IST|Sakshi

Ind Vs Sa ODI Series: టెస్టు సిరీస్‌లో పరాజయంతో టీమిండియాకు నిరాశే మిగిలింది. దక్షిణాఫ్రికా గడ్డపై ట్రోఫీని ముద్దాడాలన్న కల తీరాలంటే మరో సిరీస్‌ వరకు వేచిచూడాల్సిందే. ఏదేమైనా గతం గతః... ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. ఇదిలా ఉండగా... జనవరి 19 నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న వన్డే జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. 

ఓవైపు శుక్రవారం... టెస్టు స్పెషలిస్టులు మూడో టెస్టు నాలుగో రోజు ఆటతో బిజీగా ఉంటే... వన్డే ఆటగాళ్లు ప్రాక్టీసు చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేస్తూ... మొదటి రోజు.. బాయ్స్‌తో కఠినమైన శిక్షణ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. భువనేశ్వర్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్‌ క్రిష్ణ, వెంకటేశ్‌ అయ్యర్‌, యజువేంద్ర చాహల్‌ తదితరులు ధావన్‌తో కలిసి ఫొటోకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది.

కాగా వన్డే సిరీస్‌లో భాగంగా... జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైన సంగతి తెలిసిందే. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో ఓడినప్పటికీ.. పడిలేచిన కెరటంలా కోహ్లి సేన వన్డే సిరీస్‌లో భారీ విజయం(4-1) సాధించి సత్తా చాటింది. మరి... ఈసారి కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ప్రొటిస్‌తో వన్డే సిరీస్‌కు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, యజువేంద్ర చాహల్‌, ఆర్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చహర్‌, ప్రసిద్‌ క్రిష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, జయంత్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ.

మరిన్ని వార్తలు