Ind Vs SA 3rd ODI: నేను ఒక్క మ్యాచ్‌ కూడా చూడలేదు.. అయినా అప్పుడు ధోని.. ఇప్పుడు కోహ్లి: రవిశాస్త్రి

25 Jan, 2022 13:32 IST|Sakshi

Ind Vs Sa ODI Series: ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా- టీమిండియా వన్డే సిరీస్‌ను ఫాలో కాలేదని భారత జట్టు మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. అయినప్పటికీ... కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా విరాట్‌ కోహ్లి ఆట తీరులో పెద్దగా మార్పులేమీ ఉండవని చెప్పగలనన్నాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందుకు కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మకు ఆ పగ్గాలు అప్పగించగా... అతడు గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 

ఇక అంతకుముందు టెస్టు సిరీస్‌ కోల్పోయిన తర్వాత ఆ ఫార్మాట్‌ సారథ్యానికి కోహ్లి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం తర్వాత కెప్టెన్‌ అన్న ట్యాగ్‌ లేకుండా కోహ్లి తొలిసారిగా వన్డే సిరీస్‌ ఆడాడు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 79, 0, 65 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్సీ నుంచి వైదొలగడం అతడి ఛాయిస్‌. తన నిర్ణయాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. 

ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుంది. బ్యాటింగ్‌పై దృష్టి సారించే క్రమంలో గతంలో ఎంతో మంది క్రికెటర్లు కెప్టెన్సీ వదులుకున్నారు. సచిన్‌ టెండుల్కర్‌, గావస్కర్‌, ధోని.. ఇలా ఎవరైనా సరే. వాళ్లకు సరైన సమయం అనిపించినపుడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు కోహ్లి కూడా అంతే! నిజానికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా నేను చూడలేదు. 

కానీ...  కోహ్లి ఆట తీరులో పెద్దగా తేడా ఏమీ ఉండదని చెప్పగలను’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు భంగపాటు నేపథ్యంలో... .. గత ఐదేళ్లుగా నంబర్‌ 1 గా జట్టు స్థాయి ఒక్కసారిగా పడిపోయిందనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది.

చదవండి: India New Test Captain: అసలు.. కేఎల్‌ రాహుల్‌ ఏ కోశాన్నైనా కెప్టెన్‌లా అనిపిస్తున్నాడా: బీసీసీఐ అధికారి

మరిన్ని వార్తలు