Ind Vs SA: Shikhar Dhawan To Return For South Africa ODIs Says Reports: శ్రీలంక పర్యటన నేపథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించిన టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్.. తర్వాత ఇంతవరకు జాతీయ జట్టులో కనిపించలేదు. ఈ టూర్లో భాగంగా రాహుల్ ద్రవిడ్(ప్రస్తుత హెడ్కోచ్) మార్గదర్శనంలో ధావన్ సారథ్యంలోని జట్టు వన్డే సిరీస్ను గెలవగా.. టీ20 సిరీస్ను మాత్రం ఆతిథ్య జట్టుకు అప్పజెప్పింది. ఇక జూలైలో ముగిసిన ఈ పర్యటన తర్వాత శిఖర్ జట్టుకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ సెలక్షన్ నేపథ్యంలో కూడా అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.
అంతేకాదు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్కు కూడా ధావన్ను పక్కనపెట్టేశారు. ఈ సిరీస్లో యువ ఆటగాళ్లు చెప్పదగిన ప్రదర్శన చేసిన క్రమంలో 36 ఏళ్ల ధావన్ ఇక జాతీయ జట్టులోకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త క్రీడా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
చదవండి: Ind Vs Sa Test Seires: ప్రొటిస్ జట్టు ఇదే.. పాక్కు చుక్కలు చూపించిన బౌలర్ వచ్చేశాడు!
భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో శిఖర్ ధావన్కు పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు వన్డేల సిరీస్కై జట్టును ఎంపిక చేసే క్రమంలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ పానెల్ అతడి పేరును పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. అదే నిజమైతే గబ్బర్ ఫ్యాన్స్కు నిజంగా పండుగే!
ఇదిలా ఉండగా సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ను చూసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లి స్థానంలో.. టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది.