Ind Vs Sa: కోహ్లి సెంచరీ కొడతాడు... ఇండియాదే వన్డే సిరీస్‌: ప్రొటిస్‌ మాజీ బౌలర్‌

18 Jan, 2022 14:12 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కచ్చితంగా సెంచరీ సాధిస్తాడని ప్రొటిస్‌ మాజీ బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ అన్నాడు. సౌతాఫ్రికా పిచ్‌లు అతడికి అనుకూలిస్తాయని... కోహ్లి శతక్కొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా రన్‌మెషీన్‌గా పేరొందిన కోహ్లి... సెంచరీ కొట్టి రెండేళ్లు అవుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఈ ఆశ తీరుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

పట్టుదలగా నిలబడిన కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే అవుట్‌ కావడంతో భంగపాటు తప్పలేదు. ఇక టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పడంతో భారత జట్టు సారథిగా కోహ్లి ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో కోహ్లికి ఇదే తొలి మ్యాచ్‌. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్ షో లో మోర్నీ మోర్కెల్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు... ‘‘విరాట్‌ కోహ్లి కచ్చితంగా వంద కొడతాడు. 

ముఖ్యంగా కేప్‌టౌన్‌లో బ్యాటింగ్‌ చేయడాన్ని అతడు ఆస్వాదిస్తాడు. ఇక్కడి న్యూలాండ్స్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం తనకిష్టమని కోహ్లి ఎన్నోసార్లు చెప్పాడు. సెంచరీ లేకుండా ఈ సిరీస్‌ ముగించడు అని గట్టిగా నమ్ముతున్నా’’ అని మోర్కెల్‌ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్న ఈ ప్రొటిస్‌ మాజీ పేసర్‌... 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు వేదిక అయిన పర్ల్‌ వారికి అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. 

చదవండి: Ind vs Sa ODI Series: రుతురాజ్‌కు నో ఛాన్స్‌.. ధావన్‌, చహల్‌కు అవకాశం!

మరిన్ని వార్తలు