IND VS SL 2nd Test Day 1: శ్రేయస్‌ ఒంటరి పోరాటం.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ 

12 Mar, 2022 18:45 IST|Sakshi

మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్ (92, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా, శ్రేయస్‌ ఏమ్రాతం తగ్గకుండా దూకుడుగా ఆడుతూ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తొలి రోజు నుంచే బౌలర్లకు అనుకూలంగా మరిపోయిన పిచ్‌పై శ్రేయస్‌ చెలరేగి బ్యాటింగ్‌ చేశాడు. టెయిలెండర్లు క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతుండగా 11వ నంబర్‌ ఆటగాడు బుమ్రా (0) సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. మరో 8 పరుగులు చేస్తే కెరీర్‌లో రెండో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్‌ స్టంపవుటయ్యాడు. దీంతో 252 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. కెరీర్‌లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (15)తో పాటు 101 టెస్ట్‌ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (23), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (4) మరోసారి నిరాశపరిచారు. హనుమ విహారి (31), రిషబ్‌ పంత్‌ (26 బంతుల్లో 39; 7 ఫోర్లు) పర్వాలేదనిపించగా, తొలి టెస్ట్‌ హీరో రవీంద్ర జడేజా (4), అశ్విన్‌ (13), అక్షర్‌ (9), షమీ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో బుమ్రా సహకారంతో శ్రేయస్‌ ఆపద్భాందవుని ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. లంక బౌలర్లలో లసిత్‌ ఎంబుల్దెనియా, ప్రవీణ్‌ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2,  సురంగ లక్మల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. మయాంక్‌ అగర్వాల్‌  రనౌటయ్యాడు. 
చదవండి: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్‌ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత!

మరిన్ని వార్తలు