Ind Vs SL: రెండో వన్డేను ఎంజాయ్‌ చేసిన కోహ్లి బృందం

21 Jul, 2021 19:02 IST|Sakshi

లండన్‌: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శిఖర్‌ ధావన్‌ సారధ్యంలోని టీమిండియా రెండో జట్టు చేస్తున్న అద్భుత ప్రదర్శనపై సీనియర్‌ జట్టు ప్రశంసలు కురిపిస్తుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో దీపక్‌ చహర్‌ అద్బుత ప్రదర్శనపై విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, పుజారా తదితరులు టీమిండియాకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సీనియర్‌ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ అనంతరం టీమిండియా సీనియర్‌ జట్టులోని విరాట్‌ కోహ్లి, ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కోచ్‌ రవిశాస్త్రి డ్రెస్సింగ్‌ రూమ్ నుంచి భారత్‌, లంక వన్డే మ్యాచ్‌ను ఆస్వాదించారు. మిగతా ఆటగాళ్లు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడినుంచే  మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇక అశ్విన్‌, పుజారాలు బస్సులో వెళ్తూ.. టీమిండియా మ్యాచ్‌ గెలిచిందనగానే హైఫై ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. మ్యాచ్‌ విజయం అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు టీమిండియా జట్టును ట్విటర్‌ ద్వారా అభినందించారు. 

ఇక టీమిండియా సీనియర్‌ జట్టు, ఇంగ్లండ్‌ల మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. మరోపక్క కౌంటీ ఎలెవెన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతూ జోరు ప్రదర్శిస్తుంది. కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కాగా అతని గైర్హాజరీలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీతో దుమ్మురేపాడు.

మరిన్ని వార్తలు