Rohit Sharma: నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.. అయితే ఐపీఎల్‌ తర్వాత!

10 Jan, 2023 10:10 IST|Sakshi
టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌- ‍కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

India vs Sri Lanka, 1st ODI - Rohit Sharma- గువహటి: వచ్చే టి20 వరల్డ్‌కప్‌ కోసం జట్టును సిద్ధం చేస్తున్నామని ఇటీవల కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి టి20ల భవిష్యత్తుపై సందేహాలు రేగాయి. వారిని పక్కన పెట్టి జట్టును పునర్నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కెప్టెన్‌ రోహిత్‌ స్పందించాడు.

తానేమీ అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకోలేదని, ఐపీఎల్‌ తర్వాతే దీనిపై ఆలోచిస్తానని అతను అన్నాడు. ‘మనం ఈ ఏడాది ఆరు టి20లు ఆడాల్సి ఉంటే మూడు ముగిశాయి. మిగతా మూడులో ఏం చేయాలో తెలుసు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు.

అందరూ అన్ని మ్యాచ్‌లు ఆడలేరు
ఐపీఎల్‌ తర్వాతే దీనిపై ఆలోచిస్తా. అయితే ఈ ఏడాది మా అందరి దృష్టీ వన్డేలపైనే ఉంది. అందరూ అన్ని మ్యాచ్‌లు ఆడలేరు. సీనియర్లకు పని భారం తగ్గించడంలో భాగంగానే లంకతో సిరీస్‌లో కొత్త ఆటగాళ్లు ఆడారు. నేను కూడా విశ్రాంతి తీసుకున్నవారిలో ఉన్నాను’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య గువహటి వేదికగా మంగళవారం తొలి వన్డే ఆరంభం కానుంది. 

రికార్డుల వీరుడు!
ఈ నేపథ్యంలో​ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. లంకతో టీ20 సిరీస్‌కు తను అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మకు ఘనమైన రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్‌ ఏకంగా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు లీగ్‌, అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు.

చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం?
AUS Vs IND: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు