Ind Vs SL: జట్టులోకి తిరిగి రావడం సంతోషం.. ప్రాక్టీస్‌ మొదలైంది: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌

23 Feb, 2022 15:25 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చాలా రోజుల తర్వాత జట్టుతో చేరనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగే టీ20, టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ టీవీతో మాట్లాడిన అతడు పునరాగమనం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘రెండు నెలల తర్వాత ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడబోతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది.

టీ20, టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచేందుకు శక్తి మేర కృషి చేస్తాను’’ అని జడ్డూ పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌ సమయంలో గాయపడిన జడేజా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందిన జడేజా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.

ఈ నేపథ్యంలో లంకతో సిరీస్‌తో మళ్లీ టీమిండియాతో కలవనున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాక్టీసు సెషన్‌ మొదలుపెట్టాడు. జడ్డూ రాకతో భారత్‌ జట్టు బలం పెరిగినట్లయింది. ఇక జడ్డూతో పాటు స్టార్‌ పేసర్‌, వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఈ సిరీస్‌తో జట్టులోకి రానున్నాడు. కాగా లక్నో వేదికగా ఫిబ్రవరి 24 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: Ind Vs Sl T20 Series: టీమిండియాతో సిరీస్‌.. శ్రీలంకకు భారీ షాక్‌.. కీలక ఆటగాడు దూరం!

మరిన్ని వార్తలు