IND Vs SL: సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన లంక బోర్డు

12 Jul, 2021 20:35 IST|Sakshi

కొలొంబో: భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుందని, అయితే స్వల్ప సమయ మార్పులు జరిగాయని వెల్లడించింది. జులై 18, 20, 23న జరిగే వన్డే మ్యాచ్‌లు అరగంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు), 25, 27, 29న జరిగే టీ20లు గంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు జులై 18కి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే లంక బోర్డు ఆయా మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. 

మరిన్ని వార్తలు