IND Vs SL: చహల్‌, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్‌

30 Jul, 2021 12:34 IST|Sakshi

కొలంబో: టీ20 సిరీస్‌ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు మరోషాక్‌ తగిలింది. తాజాగా భారత స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌, కె. గౌతమ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్‌, గౌతమ్‌లు క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్‌కు ముందు కృనాల్‌ పాండ్యా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కృనాల్‌తో క్లోజ్‌గా ఉన్న 8 మందిని క్వారంటైన్‌కు తరలించగా.. అందులో చహల్‌, గౌతమ్‌లు కూడా ఉన్నారు. తాజాగా వీరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఇక లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్కించుకున్న భారత్‌ టీ20 సిరీస్‌లో మాత్రం అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మొదటి టీ20 మ్యాచ్‌ నెగ్గిన టీమిండియా తర్వాత వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా ప్రస్తుతం కొద్దిరోజులు లంకలోనే ఉండనున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల అనంతరం నెగెటివ్‌ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానుంది.  ఆ తర్వాత అదే గడ్డపై టీ20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా సీనియర్‌ జట్టు ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు