IND Vs SRI: టీమిండియా స్పిన్నర్లను ఊరిస్తున్న రికార్డులు

20 Jul, 2021 12:16 IST|Sakshi

కొలంబో: పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలోని భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్‌ సేన పట్టుదలగా ఉంది. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

మొదట యజ్వేంద్ర చహల్‌ విషయానికి వస్తే.. చహల్‌ ఈ మ్యాచ్‌లో మరో ఆరు వికెట్లు తీస్తే గనుక వన్డే క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్ల ఫీట్‌ అందుకున్న ఆటగాడిగా చహల్‌ నిలువనున్నాడు. షమీ 56 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకోగా.. చహల్‌ కూడా ప్రస్తుతం 56వ మ్యాచ్‌ ఆడనున్నాడు.ఇదే మ్యాచ్‌లో హర్బజన్‌ రికార్డును కూడా చహల్‌ అందుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చహల్‌ ఐదు వికెట్ల ఫీట్‌ అందుకుంటే హర్భజన్‌తో సమానంగా వన్డేల్లో మూడు సార్లు ఐదు వికెట్ల హాల్‌ అందుకున్న ఆటగాడిగా నిలవనున్నాడు. మరో టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను కూడా ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు వన్డేల్లో 107 వికెట్లు తీసిన కుల్దీప్‌.. మరొక వికెట్‌ తీస్తే బుమ్రా.. మూడు వికెట్లు తీస్తే యువరాజ్‌లతో సమానం కానున్నాడు. ఇక తొలి వన్డేలో ఈ ఇద్దరు తమ బౌలింగ్‌లో దారాళంగా పరుగులు ఇచ్చుకున్నా కీలక సమయంలో వికెట్లు తీశారు. చహల్‌ , కుల్దీప్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

ఇక తొలి వన్డేలో (86 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న శిఖర్‌ ధావన్‌ ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లు( వన్డే, టీ20, టెస్టు) కలిపి 10వేల పరుగుల  మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెట్‌ చరిత్రలో ఓపెనర్‌గా వచ్చి 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సచిన​ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, సునీల్‌ గావస్కర్‌, రోహిత్‌ శర్మలు ఈ ఫీట్‌ను సాధించారు. అంతేగాక వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా 6వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా ధావన్‌ నిలిచాడు.  

మరిన్ని వార్తలు