IND VS WI 1st T20: భారత తుది జట్టు ఎలా ఉండబోతుందంటే..?

28 Jul, 2022 21:13 IST|Sakshi

విండీస్‌తో 3 వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి జోరుమీదున్న టీమిండియా.. రేపటి (జులై 29) నుంచి ప్రారంభంకాబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సమాయత్తమవుతోంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదికగా రేపు ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది.

ఈ సిరీస్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియాను ముందుండి నడిపించనుండగా.. వికెట్‌కీపర్లు దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ తిరిగి జట్టులో చేరనున్నారు. వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన జట్టులోని చాలామంది సభ్యులు ఈ సిరీస్‌ను అందుబాటులో ఉండకపోవడంతో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ప్రస్తుత సమీకరణల ప్రకారం చూస్తే.. రోహిత్ శర్మకు జతగా రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కరోనా కారణంగా రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో పంత్‌కు ప్రమోషన్‌ లభించే ఛాన్స్‌ ఉంది. ఈ ఆప్షన్‌ వల్ల దినేశ్‌ కార్తీక్‌కు కూడా తుది జట్టులో చోటు లభిస్తుంది.

మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌ల బెర్తులు దాదాపుగా ఖరారేనని చెప్పాలి. ఆల్‌రౌండర్ల కోటాలో దీపక్‌ హుడా, హార్దిక్ పాండ్యా, అక్షర్‌ పటేల్‌లు తుది జట్టులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బౌలర్ల విషయానికొస్తే.. హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. 

భారత తుది జట్టు(అంచనా)..
రోహిత్ శర్మ(కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్
చదవండి: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు