Ind Vs WI T20 Series: ఓపెనర్‌గా డీకే! ఐదో స్థానంలో రోహిత్‌ ఎందుకు రాకూడదు? రూల్‌ అంటే రూలే మరి!

2 Aug, 2022 15:43 IST|Sakshi
రోహిత్‌ శర్మ- దినేశ్‌ కార్తిక్‌(PC: BCCI)

India Vs West Indies T20 Series- Suryakuma Yadav As Opener: ‘‘నా వరకు నేను ఏమనుకుంటున్నానంటే.. దినేశ్‌ కార్తిక్‌తో మీరు ఎందుకు ఓపెనింగ్‌ చేయించకూడదు? రోహిత్‌ శర్మ ఐదో స్థానంలో ఎందుకు బ్యాటింగ్‌కు రాకూడదు? అయినా వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు రూల్స్‌ ఉంటాయా?’’ అంటూ భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. 

కాగా టీమిండియా తరచుగా ఓపెనింగ్‌ జోడీని మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాలుగో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను వెస్టిండీస్‌ పర్యటనలో ఓపెనర్‌గా దించడంపై క్రీడా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఇలాగే ఉంటాం!
ఇంగ్లండ్‌ టూర్‌లో రిషభ్‌ పంత్‌ ఓపెనర్‌గా విఫలమవడం.. ప్రస్తుతం సూర్య కూడా అదే తరహాలో నిరాశపరచడంతో విమర్శలు తీవ్రతరమయ్యాయి. అయితే, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం.. జట్టులోని ఏ ఒక్క బ్యాటర్‌ ఏ ఒక్క స్థానంలో ఆడటానికే పరిమితం కావొద్దని.. ప్రతి ఒక్కరు ఏ స్థానంలో బరిలోకి దిగేందుకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు.


ఆకాశ్‌ చోప్రా

అదో పిచ్చి పని!
అదే విధంగా.. ఒకరిద్దరిపై ఆధారపడాల్సిన పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతోనే ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ జతిన్‌ సప్రుతో యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ మేరకు ఆకాశ్‌ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఓపెనింగ్‌ జోడీ విషయం అందరినీ తికమక పెడుతోంది.

ఇంగ్లండ్‌తో రిషభ్‌ పంత్‌ను ఓపెనర్‌గా పంపారు కదా! మరి ఇప్పుడు.. సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా పంపడం అర్థంపర్థంలేని చర్య. ఒకవేళ సూర్య బాగా ఆడి తదుపరి మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధిస్తే భేష్‌! వరస్ట్‌ కేస్‌ ఏంటంటే.. మూడు మ్యాచ్‌లలో కలిపి అతడు 30 పరుగులు కూడా చేయలేకపోవచ్చు. మొత్తానికి ఈ టీ20 సిరీస్‌లో అతడు 60 పరుగులు చేస్తే పెద్ద విషయమే’’ అని పేర్కొన్నాడు. 

మీరేం సాధించారు?
అదే విధంగా.. తనకు అలవాటైన స్థానంలో రాణిస్తున్న బ్యాటర్‌ను ఇలా ఇబ్బందిపెట్టి మీరు ఏం సాధిస్తామనుకుంటున్నారు అని మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. వరుస మ్యాచ్‌లలో విఫలమైతే బ్యాటర్‌ ఆత్మవిశ్వాసం కోల్పోతాడని, తిరిగి ఫామ్‌ అందుకోవడానికి కష్టపడాల్సి వస్తుందని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. విండీస్‌- భారత్‌ మధ్య మూడో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా వెస్టిండీస్‌తో ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20లలో రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనింగ్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 24,11. ఇక మంగళవారం(ఆగష్టు 2) విండీస్‌- టీమిండియా మధ్య మూడో టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు చెరోటి గెలిచి ఇరు జట్లు 1-1తో​ సమంగా ఉన్నాయి.

చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్‌ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే!
IND vs WI: టీ20ల్లో రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. రెండో భారత కెప్టెన్‌గా!

>
మరిన్ని వార్తలు