IND vs WI T20: నాలుగో టి20.. గెలిస్తే సిరీస్‌ వశం

6 Aug, 2022 06:15 IST|Sakshi

నేడు విండీస్‌తో భారత్‌ నాలుగో టి20

రాత్రి 8 గంటల నుంచి డీడీ స్పోర్ట్స్‌లో

ఫ్లోరిడా: అమెరికా గడ్డపై సిరీస్‌ తేల్చుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు వెస్టిండీస్‌తో నాలుగో టి20లో తలపడనుంది. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ సిరీస్‌ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్‌ పరిస్థితి భిన్నం. ఈ రెండూ గెలిస్తేనే పొట్టి సిరీస్‌ దక్కుతుంది. లేదంటే వన్డే సిరీస్‌ను అప్పగించినట్లే టి20 సిరీస్‌ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టాల్సి వస్తుంది.

అందుకే ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఎక్కువగా టి20లే ఆడుతోంది. వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కాలంటే దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌లు మెరుపులు మెరిపించాల్సిందే. కాబట్టి ఇకపై వీళ్లకి ప్రతీ మ్యాచ్‌ కూడా ఫైనల్‌ పరీక్షలాంటిదే. రెండు రోజుల్లో రెండూ గెలవాల్సిన ఒత్తిడిలో వెస్టిండీస్‌ ఉంది. రెండో టి20లో బౌలింగ్‌తో బెదరగొట్టిన కరీబియన్‌ బౌలర్లు గత మ్యాచ్‌లో తేలిపోయారు.

మరిన్ని వార్తలు