Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! సిరీస్‌ మొత్తానికి అతడు దూరం?

27 Jul, 2022 16:07 IST|Sakshi
టీమిండియా(PC: BCCI)

India Tour Of West Indies 2022- T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టాపార్డర్‌ బ్యాటర్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు కోవిడ్‌ బారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు సమాచారం.

అయితే, రాహుల్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన బీసీసీఐ మెడికల్‌ కమిటీ.. మరో వారం రోజుల పాటు అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో విండీస్‌తో టీ20 సిరీస్‌ మొత్తానికి అతడు దూరం కానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 


కేఎల్‌ రాహుల్‌(PC: BCCI)

కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ కేఎల్‌ రాహుల్‌.. జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియాకు చికిత్స చేయించుకున్నాడు.ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడికి కరోనా సోకగా ఐసోలేషన్‌కు వెళ్లాడు. 

అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు తగిన సమయం లేకపోవడంతోనే వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైనట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక బుధవారం (జూలై 27) నాటి ఆఖరి వన్డే తర్వాత.. శుక్రవారం(జూలై 29) నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ మొదలు కానుంది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కేఎల్‌ రాహుల్‌*, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్‌ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌.
చదవండి: T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్‌ గెలిస్తే..
World Cup 2023: అందుకే గబ్బర్‌ కెప్టెన్‌ అయ్యాడు! రోహిత్‌ శర్మ కోరుకుంటున్నది అదే!

మరిన్ని వార్తలు