Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్‌ కెప్టెన్‌

20 Jul, 2022 11:13 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌- నికోలస్‌ పూరన్‌

IND vs WI ODI Series: West Indies captain Nicholas Pooran Comments- కీరన్‌ పొలార్డ్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఈ ఏడాది మేలో వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడయ్యాడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌. నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా తొలిసారిగా విండీస్‌ సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఇందులో భాగంగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టును 3-0తో విండీస్‌ వైట్‌వాష్‌ చేసింది. 

ఆరంభంలో అదుర్స్‌.. ఆ తర్వాత..
దీంతో విజయంతో కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అయితే, ఆ సంతోషం కొన్నిరోజుల్లోనే  ఆవిరైపోయింది.నెదర్లాండ్స్‌ టూర్‌ తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిన నికోలస్‌ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ గెలిచినా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఇదే తరహాలో 3-0తేడాతో పర్యాటక జట్టు చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో టీమిండియాతో స్వదేశంలో వన్డే సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది.

టీమిండియాతో పోటీకి సన్నద్ధం!
ఇప్పటికే ఇంగ్లండ్‌ టూర్‌లో టీ20, వన్డే సిరీస్‌లు గెలిచి జోష్‌లో ఉన్న పటిష్టమైన భారత జట్టుతో తలపడనుంది. ఇందుకోసం శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని వన్డే జట్టు విండీస్‌కు చేరుకుంది కూడా! ఈ నేపథ్యంలో నికోలస్‌ పూరన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా సహా కొంత మంది కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో వన్డేల్లో తమ పని కాస్త సులువవుతుందని పేర్కొన్నాడు.

అయితే, టీమిండియాలో మ్యాచ్‌ విన్నర్లకు కొదువలేదని, వాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతడు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడాడు. ‘‘వాళ్లలో(భారత జట్టు) ఎంతో మంది అద్బుత ఆటగాళ్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. బంతితోనూ... బ్యాట్‌తోనూ రాణించగలరు.

మేము చేదు అనుభవాల నుంచి కోలుకుని.. వాళ్లకు సవాలు విసరగలం. ట్రినిడాడ్‌, ఫ్లోరిడాలో సత్తా చాటుతాం. క్రికెట్‌ ప్రపంచానికి మేమేంటో చూపిస్తాం. జట్టుగా ఇది మాకొక మంచి అవకాశం. వన్డే క్రికెట్‌లో లోపాలు సరిదిద్దుకుని.. ముందుకు సాగుతాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని విండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా వెస్టిండీస్‌ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలకు శిఖర్‌ ధావన్‌ సారథిగా వ్యవహరించనుండగా.. టీ20 సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుతో చేరనున్నాడు. 

చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్‌ బౌలర్లు.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా..
India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!

మరిన్ని వార్తలు