Ind Vs Wi 3rd T20- Rohit Sharma: వాళ్లు జట్టులో లేకున్నా మేము గెలిచాం.. సంతోషం: రోహిత్‌ శర్మ

21 Feb, 2022 10:08 IST|Sakshi

ఆఖర్లో ఉత్కంఠ రేపిన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం పట్ల టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసి గెలుపొందడం సంతోషాన్నిచ్చిందన్నాడు. కీలక ఆటగాళ్లు లేకుండానే విండీస్‌ వంటి జట్టుపై ఆధిపత్యం కనబరచడం మామూలు విషయం కాదని, జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఆఖరి నామమాత్రపు ఆఖరి టీ20 మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. 

యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇషాన్‌ కిషన్‌కు జోడీగా ఓపెనింగ్‌ చేయగా... శ్రేయస్‌ అయ్యర్‌ వన్‌డౌన్‌లో వచ్చాడు. రోహిత్‌ శర్మ నాలుగు, సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన వెంకటేశ్‌ అయ్యర్‌ 35 పరుగులతో అజేయంగా నిలవడమే గాకుండా... ఛేదనలో 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ సైతం అద్భుతంగా రాణించడంతో భారత్‌ గెలుపు ఖాయమైంది. 

ఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... ‘‘లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టులో భాగమైన చాలా మంది ఆటగాళ్లు లేకుండా మేము బరిలోకి దిగాం. మిడిలార్డర్‌లో మార్పులు చేశాం. వ్యూహాలను పక్కాగా అమలు చేశాం. యువ జట్టుతో లక్ష్యాన్ని ఛేదించడం సంతోషకరం. ఒత్తిడిలోనూ బౌలర్లు రాణించిన విధానం ప్రశంసనీయం. విండీస్‌ లాంటి బలమైన జట్టుపై సమష్టి ప్రదర్శనతో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. 

మూడో టీ20- స్కోర్లు:
టీమిండియా- 184/5 (20)
వెస్టిండీస్‌- 167/9 (20)

చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్‌... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త..

మరిన్ని వార్తలు