Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్‌! వైస్‌ కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!

14 Jul, 2022 11:27 IST|Sakshi

India Vs West Indies T20 Series 2022: ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకున్న తర్వాత టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. విండీస్‌తో వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.

ఇక జూలై 22 నుంచి 27 వరకు వన్డే సిరీస్‌ జరుగనుండగా.. విండీస్‌- టీమిండియా మధ్య జూలై 29 నుంచి పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ ఆరంభం కానుంది. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని పక్కనపెట్టేందుకు సెలక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మొదటి వన్డేకు దూరమైన కోహ్లి.. కోలుకోవడానికి సమయం పడుతుందని.. అందుకే అతడికి రెస్ట్‌ ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధమైనట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. 

అదే విధంగా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నారట. ఇక గాయం కారణంగా ఇన్నాళ్లు జట్టుకు దూరమైన చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ విండీస్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది.


కేఎల్‌ రాహుల్‌

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌
టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వెస్టిండీస్‌తో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌తో జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన రాహుల్‌ ఆఖరి నిమిషంలో దూరమైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత అతడు స్పోర్ట్స్‌ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్న రాహుల్‌ విండీస్‌ టూర్‌కు పయనం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: IND VS ENG 1st ODI: రోహిత్‌ శర్మ భారీ సిక్సర్‌.. బంతి తగిలి చిన్నారికి గాయం
ICC World Cup Super League: వన్డే సిరీస్‌ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌! ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?

మరిన్ని వార్తలు