Ind VS Zim 1st ODI: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్‌కు నో ఛాన్స్‌! త్రిపాఠి అరంగేట్రం!

17 Aug, 2022 11:42 IST|Sakshi
టీమిండియా యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(PC: BCCI)

Ind Vs Zim 1st ODI- Aakash Chopra's India Probable XI: కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని టీమిండియా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో గురువారం(ఆగష్టు 18) హరారే వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మొదటి వన్డేకు తన జట్టును ప్రకటించాడు. 

ఇషాన్‌కు నో ఛాన్స్‌!
 కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ జట్టులో ఉన్న నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం రాదని అంచనా వేసిన ఆకాశ్‌.. ఇషాన్‌ కిషన్‌కు తుది జట్టులో అసలు చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌తో 31 ఏళ్ల రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉందని పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఆకాశ్‌ అంచనా వేశాడు.

అదే విధంగా.. జింబాబ్వేతో మొదటి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. స్పిన్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌.. పేస్‌ బౌలర్లు దీపక్‌ చహర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణకు తన జట్టులో చోటిచ్చాడు ఈ కామెంటేటర్‌.

ఓపెనర్లుగా వాళ్లిద్దరే!
ఈ మేరకు ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్‌ పర్యటనలో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా రాణించాడు. అయితే, ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు శిఖర్‌ ధావన్‌ కూడా ఉన్నాడు. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌తో వెళ్లాలనుకుంటే కచ్చితంగా వీళ్లిద్దరే ఓపెనర్లుగా వస్తారు. 

అయితే, రాహుల్‌ విలక్షణమైన బ్యాటర్‌.. ఏ స్థానంలోనైనా అతడు సత్తా చాటగలడు. కానీ.. ఐపీఎల్‌-2022 తర్వాత అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఏదేమైనా ఎప్పటిలాగే అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. ఇక మూడో స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ ఉండనే ఉన్నాడు.

త్రిపాఠి అరంగేట్రం!
నేనైతే సంజూ శాంసన్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేస్తాను. దీపక్‌ హుడా ఐదు, ఆ తర్వాతి స్థానంలో రాహుల్‌ త్రిపాఠి. నిజానికి త్రిపాఠి కూడా ఏ స్థానంలోకి బరిలోకి దిగినా తనను తాను నిరూపించుకోగలడు. రుతురాజ్‌, ఇషాన్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఆడరు కాబట్టి అతడు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది’’ అని బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా రాహుల్‌ త్రిపాఠి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.

జింబాబ్వేతో మొదటి వన్డేకు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత జట్టు:
కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌, సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.

చదవండి: Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్‌, జట్ల వివరాలు.. తాజా అప్‌డేట్లు!
 Ned Vs Pak 1st ODI: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ‘పసికూన’! వామ్మో.. బాబర్‌ ఏమన్నాడంటే!
 

మరిన్ని వార్తలు