Ind Vs Zim 3rd ODI: సికిందర్‌ రజా సెంచరీ వృథా.. పోరాడి ఓడిన జింబాబ్వే!

22 Aug, 2022 21:26 IST|Sakshi

హరారే వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. జింబాబ్వే బ్యాటర్‌ సికిందర్‌ రజా సెంచరీ సాధించి ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

9 బంతుల్లో 15 పరుగులు కావల్సిన నేపథ్యంలో రజా ఔట్‌ కావడంతో భారత విజయం లాంఛనమైంది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.. తద్వారా భారత్‌ చేతిలో జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్‌ రజా(115) సెంచరీతో చెలరేగగా.. విలియమ్స్‌ 45 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో ఆవేష్‌ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక సెంచరీతో అదరగొట్టిన గిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

సెంచరీతో చేలరేగిన గిల్‌
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్‌(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్‌ కిషన్‌(50), ధావన్‌(40) పరుగులతో రాణించారు. కాగా గిల్‌కు ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఎవాన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్‌ సాధించారు. 


చదవండిIND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు!

మరిన్ని వార్తలు