IND W vs ENG W 3rd T20: మళ్లీ ఓడిన మన మహిళలు

17 Sep, 2022 04:36 IST|Sakshi

టి20 సిరీస్‌ ఇంగ్లండ్‌ సొంతం

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌ గడ్డపై భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. పేలవమైన బ్యాటింగ్‌ ప్రదర్శన హర్మన్‌ బృందానికి ఓటమిని అందించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఒక దశలో టీమ్‌ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 9.5 ఓవర్లకే షఫాలీ (5), స్మృతి (9), మేఘన (0), హేమలత (0), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (5) వెనుదిరగ్గా... 52 పరుగుల వద్ద స్నేహ్‌ రాణా (8) వికెట్‌ పడింది.

ఈ దశలో రిచా ఘోష్‌ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు), దీప్తి శర్మ (25 బంతుల్లో 24) ఆదుకోవడంతో స్కోరు 100 పరుగులు దాటగలిగింది. చివర్లో పూజ వస్త్రకర్‌ (19 నాటౌట్‌; 2 ఫోర్లు) కూడా కొన్ని పరుగులు జోడించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ (3/25) భారత్‌ను దెబ్బ తీయగా, సారా గ్లెన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు సాధించి గెలిచింది. సోఫియా డంక్లీ (44 బంతుల్లో 49; 6 ఫోర్లు), అలైస్‌ క్యాప్సీ (24 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, డానీ వ్యాట్‌ (22; 1 ఫోర్‌) రాణించింది. ఇరు జట్ల మధ్య ఆదివారం హోవ్‌లో తొలి వన్డే జరుగుతుంది.

మరిన్ని వార్తలు