IND vs AUS: పాకిస్తాన్‌ రికార్డు బద్దలు కొట్టిన భారత్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

26 Sep, 2022 15:34 IST|Sakshi

హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. 2022 ఏడాదిలో భారత్‌కు ఇది 21 టీ20 విజయం. తద్వారా టీ20 క్రికెట్‌లో టీమిండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

ఒకే క్యాలెండర్‌ ఈయర్‌లో టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో పాకిస్తాన్‌ 20 టీ20ల్లో విజయం సాధించింది. తాజా విజయంతో పాక్‌ రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో గ్రీన్‌(21 బంతుల్లో52 పరుగులు), డేవిడ్‌(27 బంతుల్లో 54) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు.

ఇక 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో విరాట్‌ కోహ్లి( 48 బంతుల్లో 63), సూర్యకుమార్‌ యాదవ్‌(36 బంతుల్లో 69) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
చదవండి: IND Vs AUS: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రెండో భారత కెప్టెన్‌గా

మరిన్ని వార్తలు