IND VS SA 3rd ODI: ప్రపంచ రికార్డు సమం చేసిన భారత్‌

11 Oct, 2022 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్‌ 11) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్‌ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (49) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (28) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా భారత్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

కాగా, ఈ విజయంతో భారత్‌.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును సమం చేసింది. క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు (అన్ని ఫార్మాట్లలో) సాధించిన జట్టుగా టీమిండియా.. ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2003లో ఆసీస్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 38 విజయాలు (రికీ పాంటింగ్‌ సారధ్యంలో 30 వన్డేలు, 8 టెస్ట్‌లు) నమోదు చేయగా.. ఈ ఏడాది భారత్‌ ఇప్పటికే (ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ ఇంకా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది) 38 విజయాలు (56 మ్యాచ్‌ల్లో 23 టీ20లు, 2 టెస్ట్‌లు, 13 వన్డేలు) సాధించి ఆసీస్‌ రికార్డుకు ఎసరు పెట్టే దిశగా సాగుతుంది.

5 వరుస పరాజయాలతో ఈ క్యాలెండర్‌ ఇయర్‌ను ప్రారంభించిన భారత్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా వరుస విజయాల బాట పట్టింది. ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై భంగపడ్డా.. ఆతర్వాత వరుసగా వెస్టిండీస్‌, శ్రీలంక, జింబాబ్వే, ఇంగ్లండ్‌, తాజాగా దక్షిణాఫ్రికాపై వరుస విజయాలు సాధించింది. ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/18), వాషింగ్టన్‌ సుందర్‌ (2/15), షాబాజ్‌ అహ్మద్‌ (2/32), సిరాజ్‌ (2/17) ధాటికి సఫారీ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. సఫారీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. వీరిలో క్లాసెన్‌ (34) టాప్‌ స్కోరర్‌ కాగా.. జన్నెమాన్‌ మలాన్‌ 15, జన్సెన్‌ 14 పరుగులు సాధించారు.

మరిన్ని వార్తలు