Hockey Asia Cup: దక్షిణ కొరియాతో భారత్‌ పోరు.. ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా...!

31 May, 2022 07:25 IST|Sakshi

జకార్తా: మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి నిమిషాల్లో ‘డ్రా’ చేసుకున్న భారత్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నీ సూపర్‌–4 రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ చివరి మ్యాచ్‌లో నేడు దక్షిణ కొరియాతో తలపడనుంది. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా దక్షిణ కొరియాపై విజయం సాధించి దర్జాగా ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. లీగ్‌ దశలోని రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సూపర్‌–4 రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. సూపర్‌–4 రౌండ్‌ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరుకుంటాయి.

ప్రస్తుతం రెండు మ్యాచ్‌లు ముగిశాక కొరియా, భారత్‌ ఖాతాలో నాలుగు పాయింట్ల చొప్పున సమంగా ఉన్నాయి. మెరుగైన గోల్స్‌ సగటుతో కొరియా తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి. రెండు పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, పాయింట్లేమీ సాధించని జపాన్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఫైనల్‌ రేసు నుంచి జపాన్‌ నిష్క్రమించగా... నేడు జపాన్‌తో జరిగే మ్యాచ్‌లో మలేసియా గెలిస్తే ఆ జట్టు పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది. ఒకవేళ జపాన్‌తో మ్యాచ్‌ను మలేసియా ‘డ్రా’ చేసుకున్నా, లేదా ఓడిపోయినా... భారత్, కొరియా జట్లకు తమ మ్యాచ్‌కు ముందే ఫైనల్‌ బెర్త్‌లు ఖరారవుతాయి.

చదవండి: ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు

మరిన్ని వార్తలు