టీమిండియా ప్లేయర్స్‌కు జరిమానా

28 Nov, 2020 15:26 IST|Sakshi

దుబాయ్‌:  ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేయడంతో టీమిండియా ప్లేయర్స్‌కు జరిమానా పడింది. నిన్నటి మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లను 210 నిమిషాల్లో ముగించాల్సిన టీమిండియా.. అరగంటకు పైగా ఆలస్యం చేసింది. ఆసీస్‌  బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించడంతో ఫీల్డింగ్‌ పదే పదే సెట్‌ చేసే క్రమంలో ఓవర్లను పూర్తి చేయడం ఆలస్యమైంది. భారత క్రికెట్‌ జట్టు తమ నిర్ణీత ఓవర్లను పూర్తి చేయడానికి 246 నిమిషాల సమయం తీసుకుంది. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే జరిమానా విధించారు. మరొకవైపు ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా భారత ఖాతాలో చేరింది. (చెలరేగిన షాహిద్‌ అఫ్రిది)

ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.22 నియమావళి ప్రకారం ఓవర్‌రేట్‌ ఉల్లంఘనకు పాల్పడితే ప్లేయర్స్‌కు జరిమానా విధిస్తారు. దీనిలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు తమ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోల్పోనున్నారు. మ్యాచ్‌లో ఓవర్‌రేట్‌ నమోదైన విషయాన్ని ఫీల్డ్‌ అంపైర్లు రోడ్‌ టక్కర్‌, సామ్‌ నాగజస్కీ, టీవీ అంపైర్‌ పౌల్‌ రీఫెల్‌, ఫోర్త్‌ అంపైర్‌ గీరడ్‌ జీరార్డ్‌లు..రిఫరీ డేవిడ్‌ బూన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ తమ వాదనను వినిపించే అవకాశం జరిమానా పడిన జట్టు కెప్టెన్లకు ఉంటుంది. కానీ కోహ్లి మాత్రం స్లో ఓవర్‌రేట్‌ నియమావళిని ఉల్లంఘించిన విషయాన్ని అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే జరిమానా విధించారు. (రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్‌)

మరిన్ని వార్తలు