Team india Schedule 2023: ఈ ఏడాదైనా భారత్‌కు కలిసోచ్చేనా? టీమిండియా పూర్తి షెడ్యూల్‌ ఇదే?

1 Jan, 2023 11:59 IST|Sakshi

భారత జట్టుకు 2022 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. గతేడాది జరిగిన ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశ పరిచింది. ఇక 2023 కొత్త సంసంవత్సరంలో క్రికెట్‌ ప్రపంచంలో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్దమైంది. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో ఈ ఏడాదిని టీమిండియా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో భారత జట్టు పూర్తి షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం.

శ్రీలంకతో మొదలు..
టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ల జరగనుంది. జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న మొదటి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. రెండో టీ20 జనవరి 5న పుణేలో, మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. అదే విధంగా వన్డే సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో జరగనున్నాయి.
న్యూజిలాండ్‌తో పోరు
శ్రీలంకతో వైట్‌ బాల్‌ సిరీస్‌ ముగిసిన అనంతరం సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 21, 24 తేదీల్లో రాయ్‌పూర్‌, ఇండోర్‌లలో మిగతా రెండు వన్డేలు జరుగుతాయి. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా జనవరి 27, 29, ఫిబ్రవరి 1న రాంచీ, లక్నో, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లక్ష్యంగా
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత జట్టు స్వదేశంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపనుంది. టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 సైకిల్‌లో టీమిండియాకు ఇదే ఆఖరి సిరీస్‌. భారత్‌ ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను ఖారారు చేసుకుంటుంది. ఇక టెస్టు సిరీస్‌లో భాగంగా  ఫిబ్రవరి 9-13 వరకు నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది.

అనంతరం ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్‌ ఢిల్లీలో, మార్చి 1-5 వరకు ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్‌ అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఇక టెస్టు సిరీస్‌ ముగిసిన అనంతరం ఆసీస్‌తో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ కూడా ఆడనుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, విశాఖపట్నం, చెన్నై వేదికలగా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగనుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్‌లో జరగనుంది. ప్రస్తుతం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్‌ విజయం సాధిస్తే ఖచ్చితంగా ఫైనల్లో అడుగు పెడుతోంది.

విండీస్‌ పర్యటనకు..
జూలై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

ఆసియా కప్‌ 2023..
2023 ఆసియా కప్‌ సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌ వేదికగా జరగనుంది.  ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనడంపై ఇంకా  సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో  పాల్గొనేందుకు టీమిండియా వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్లే. ఒకవేళ తటస్థ వేదికపై ఆసియా కప్‌ను నిర్వహిస్తేనే భారత జట్టు ఆడుతోంది అని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

స్వదేశంలో మళ్లీ ఆసీస్‌తో..

వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్‌లో భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఇంకా షెడ్యూల్‌ ఖారారు కాలేదు.

సొంత గడ్డపై ప్రపంచకప్‌..
ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. తొలి సారిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు పూర్తి స్థాయిలో భారత్‌ అతిథ్యం ఇవ్వనుంది.   గతంలో 1987, 1996, 2011లలోనూ భారత్‌ అతిథ్యం ఇచ్చినప్పటకీ.. పాకిస్తాన్‌, శ్రీలంక వంటి దేశాలతో సంయుక్తంగా నిర్వహించింది.

ముచ్చటగా మూడో సారి
ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు మరోసారి భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా కంగారూలు ఐదు టీ20ల సిరీస్‌ ఆడనున్నారు. ఈ సిరీస్‌ నవంబర్‌ ఆఖరిలో జరిగే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా పర్యటనతో ముగింపు
ఏడాది చివర్లో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌ నుంచి ఈ టూర్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

మరిన్ని వార్తలు