2022 Thomas-Uber Cup: ఈసారైనా పతకం వచ్చేనా!

8 May, 2022 09:12 IST|Sakshi

నేటి నుంచి థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ 

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పతకాలే లక్ష్యంగా భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. నేడు జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌ల్లో జర్మనీతో భారత పురుషుల జట్టు... కెనడాతో భారత మహిళల జట్టు తలపడతాయి. ఈ మెగా ఈవెంట్‌లో అందరి కళ్లు థామస్‌ కప్‌లో పోటీపడనున్న భారత పురుషుల జట్టుపైనే ఉన్నాయి. థామస్‌ కప్‌ చరిత్రలో భారత్‌కు ఇప్పటివరకు ఒక్కసారీ పతకం రాలేదు.

మరోవైపు మహిళల ఈవెంట్‌ ఉబెర్‌ కప్‌లో భారత్‌ రెండుసార్లు (2014, 2016) సెమీఫైనల్‌ చేరి కాంస్య పతకాలు సాధించింది. లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్‌... సాత్విక్‌–చిరాగ్‌ శెట్టిలతో భారత పురుషుల జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్‌ ‘సి’లో జర్మనీ, చైనీస్‌ తైపీ, కెనడా జట్లతో భారత్‌ పోటీపడనుంది. ఈసారి భారత మహిళల జట్టులో పీవీ సింధు మినహా మిగతా వారందరూ అంతర్జాతీయస్థాయిలో అంతగా అనుభవంలేని వారే ఉన్నారు. గ్రూప్‌ ‘డి’లో భారత్‌తోపాటు కొరియా, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. భారత్‌కు విజయం దక్కా లంటే సింధుతోపాటు ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్‌ సింగిల్స్‌లో రాణించాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు