-

IND Vs WI: కరేబియన్‌ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర

28 Jul, 2022 07:21 IST|Sakshi

కరేబియన్‌ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్‌వాష్‌ చేయడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా విండీస్‌ను 119 పరుగుల భారీ తేడాతో ఓడించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికి అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్‌ జట్టు కుప్పకూలింది. ఈ క్రమంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది.

119 పరుగులు- విండీస్‌ గడ్డపై వన్డేల్లో టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం

ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో భాగంగా  2007 నుంచి 2022 వరకు చూసుకుంటే వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది 12వ సిరీస్‌ విజయం. అంతేకాదు వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక వన్డే సిరీస్‌లు గెలిచిన జాబితాలో టీమిండియా తొలి స్థానంలో ఉంది.  రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌(1996-2021 వరకు) జింబాబ్వేపై 11 సార్లు, వెస్టిండీస్‌పై(1999-2022 వరకు) పాకిస్తాన్‌ 10సార్లు, జింబాబ్వేపై(1995-2018 వరకు) సౌతాఫ్రికా 9సార్లు వన్డే సిరీస్‌లు నెగ్గగా.. ఇక శ్రీలంకపై భారత్‌(2007-2021) వరకు 9సార్లు వన్డే సిరీస్‌లు గెలిచింది.

ఇక విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో ఒక జట్టును డబుల్‌ వైట్‌వాష్‌ చేసిన మూడో జట్టుగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనకు వచ్చిన విండీస్‌ 3-0తో వైట్‌వాష్‌ అయింది. 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపైనే 4-0తో వైట్‌వాష్‌ చేయగా.. అదే ఏడాది కెన్యా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో డబుల్‌ వైట్‌వాష్‌ చేసింది.ఇక 2006లో బంగ్లాదేశ్‌ ఇంటా, బయటా రెండుసార్లు 3-0తో కెన్యాను క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ ఏడాది జూన్‌- జూలై మధ్యలో విండీస్‌ 9 వన్డే మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యింది. ఇంతకముందు 2005లో ఫిబ్రవరి-ఆగస్టు మధ్య 11 వన్డేలు, అక్టోబర్‌ 1999-జనవరి 2000 మధ్య 8 వన్డేలు, జూలై 2009-ఫిబ్రవరి 2010 మధ్య 8వన్డేల్లో పరాజయాలు చవిచూసింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు