ఇండియాదే లెజెండ్స్ ‌కప్‌

22 Mar, 2021 13:17 IST|Sakshi

ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌పై గెలుపు

మెరిసిన యువరాజ్, యూసుఫ్‌ పఠాన్‌  

రాయ్‌పూర్‌: రిటైర్డ్‌ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 క్రికెట్‌ టోర్నీ కప్‌లో భారత్‌ లెజెండ్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌ జట్టును ఓడించింది. యూసుఫ్‌ పఠాన్‌ (36 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు)... యువరాజ్‌ సింగ్‌ (41 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో... తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. సెహ్వాగ్‌ (12 బంతుల్లో 10; 1 సిక్స్‌) విఫలంకాగా... సచిన్‌ టెండూల్కర్‌ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు.


అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. దిల్షాన్‌ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), జయసూర్య (43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్‌ యూసుఫ్‌ పఠాన్‌ రెండు వికెట్లు తీశాడు. చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ చేతుల మీదుగా సచిన్‌ లెజెండ్స్‌ కప్‌ను అందుకున్నాడు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (యువీ దూకుడు.. యూసఫ్‌ మెరుపులు)

మరిన్ని వార్తలు