India Mens Squash Team: భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర

4 Nov, 2022 21:48 IST|Sakshi

భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్‌తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్‌కు ఆధిక్యం అందించాడు.

ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్  ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్‌ను మట్టికరిపించి  గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 

కాగా గతంలో ఈ టోర్నీలో భారత్‌ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది.  సెమీస్ లో మలేషియాపై  2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్‌షిప్‌ భారత మహిళల స్క్వాష్‌ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది.

మరిన్ని వార్తలు