Commonwealth Games 2022: టీమిండియాను వదలని కరోనా.. తాజాగా మరొకరికి పాజిటివ్‌

30 Jul, 2022 20:05 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని కరోనా మహమ్మారి వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభానికి ముందు మహిళా క్రికెట్‌ జట్టులోని ఇద్దరు ప్లేయర్లు (సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్‌) మహమ్మారి బారిన పడగా.. తాజాగా మహిళా హాకీ జట్టు మిడ్‌ ఫీల్డర్‌ నవ్‌జోత్‌ కౌర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

నవ్‌జోత్‌కు ఇవాళ (జులై 30) ఉదయం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్‌ రావడంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆమెకు మరో రెండు రోజుల్లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని భారత బృందానికి సంబంధించిన అధికారి తెలిపారు. ఒకవేళ అప్పటికీ ఆమెకు నెగిటివ్‌ రిపోర్ట్‌ రాకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు.

కాగా, కామన్వెల్త్ క్రీడా గ్రామంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో భాగంగా ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 
చదవండి: CWG 2022: భారత్‌ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం

మరిన్ని వార్తలు