WTC 2021-23: టీమిండియా షెడ్యూల్‌ ఖరారు.. ఇంగ్లండ్‌ సిరీస్‌తో షురూ

25 Jun, 2021 17:12 IST|Sakshi

ముంబై: మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(2021-23) పోటీలకు టీమిండియా షెడ్యూల్‌ ఖరారైంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉండనున్నాయి. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాలుగా సమాయత్తం అవుతుంది. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న ఆటగాళ్లు.. బయో బబుల్ వీడి ఇంగ్లండ్ పరిసరాలను ఆస్వాధిస్తున్నారు. టీమిండియా సభ్యులంతా తిరిగి జూలై రెండో వారంలో బయో బబుల్‌లో చేరి ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సిద్దం కానున్నారు.

టీమిండియా 2021-23 డబ్ల్యూటీసీ షెడ్యూల్‌:
* ఇండియా టూర్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ 2021
ఆగ‌స్ట్ 4-8 తొలి టెస్ట్‌, ఆగ‌స్ట్ 12-16 రెండో టెస్ట్‌, ఆగ‌స్ట్ 25-29 మూడో టెస్ట్, సెప్టెంబ‌ర్ 2-6 నాలుగో టెస్ట్‌, సెప్టెంబ‌ర్ 10-14 ఐదో టెస్ట్‌.

* న్యూజిలాండ్ టూర్ ఆఫ్‌ ఇండియా 2021
తొలి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భారత్‌కు రానుంది. విలియమ్సన్‌ సేన రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది. 

* ఇండియా టూర్ ఆఫ్‌ సౌతాఫ్రికా 2021-22
భారత్‌ ఇప్ప‌టి వ‌ర‌కు టెస్ట్ సిరీస్ గెల‌వ‌ని దేశం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే. ఈసారి ఆ ముచ్చ‌ట కూడా తీర్చుకునే అవ‌కాశం టీమిండియాకు దక్కనుంది. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్‌ ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో దక్షిణాఫ్రికాకు వెల్లనుంది.

* శ్రీలంక టూర్ ఆఫ్‌ ఇండియా 2022
వ‌చ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక.. భారత్‌లో పర్యటించనుంది. 

* ఆస్ట్రేలియా టూర్‌ ఆఫ్‌ ఇండియా 2022
2022 అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్‌ నెలల్లో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ నిమిత్తం ఆస్ట్రేలియా భారత్‌కు రానుంది.

* ఇండియా టూర్ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ 2022
వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌-2లో భాగంగా టీమిండియా ఆడే చివ‌రి టెస్ట్ సిరీస్ ఇదే. 2022 చివ‌ర్లో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించ‌నుంది.
చదవండి: అతన్ని బ్యాట్స్‌మెన్‌ కోటాలో ఆడించారు.. టీమిండియా కొంప ముంచాడు

>
మరిన్ని వార్తలు